Turkish Airlines : టర్కీకి చెందిన విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి ఇస్తాంబుల్ (టర్కీ) వెళ్తున్న విమానాన్ని బుధవారం మధ్యాహ్నం కోల్కతాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. టీహెచ్వై 727 అనే విమానం బుధవారం మధ్యాహ్నం 01.28 గంటలకు ఖాట్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరింది.
విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో దాదాపు పది నిమిషాలు ఆ విమానం అలాగే గాల్లోనే ఎగిరింది. దీంతో అధికారుల సూచన మేరకు విమానాన్ని తిరిగి త్రిభువన్ ఎయిర్ పోర్టుకు రప్పించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఎయిర్ పోర్టు మూసేశారు. అనంతరం తిరిగి విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు.
తిరిగి అక్కడి నుంచి బయల్దేరిన విమానం 02.49 గంటలకు కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం అక్కడ విమానానికి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 236 మంది ఉన్నారు. వీరిలో 225 మంది ప్రయాణికులు కాగా.. 11 మంది సిబ్బంది. భారత ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.