అదానా: వరుస భూకంపంతో అతాలకుతలమైన తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్కు చెందిన తొలి NDRF టీమ్ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది, ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారితోపాటు రక్షణ చర్యల్లో తర్ఫీదు పొందిన డాగ్ స్క్వాడ్ను కూడా తుర్కియేకు చేరవేశారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్కు అవసరమైన సామాగ్రిని కూడా వారితో పంపించారు. వాటిలో ఔషధాలు, డ్రిల్లింగ్ మెషిన్లు, కటింగ్ మిషన్లు తదితర సామాగ్రి ఉన్నాయి.
యాభై మందితో కూడిన తొలి NDRF బృందాన్ని భారత వాయుసేకు చెందిన సీ17 విమానం తుర్కియేకు చేరవేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయం కూడా భారత్ పంపిన తొలి NDRF టీమ్ భూకంప కల్లోలిత ప్రాంతానికి చేరుకుందని ప్రకటించింది. కాగా, ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి మరో NDRF బృందం కూడా తుర్కియేకు బయలుదేరింది.