ఢిల్లీ : జూలై రెండోవారం నుంచి కందిపప్పు ధర పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాపారులు, గిడ్డంగులు తమ నిల్వల సామర్థ్యాన్ని వెల్లడించేలా చూడాలని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద 38లక్షల టన్నుల పప్పుధాన్యాల బఫర్ స్టాక్ ఉన్నది. అన్ని రాష్ట్రాలు ప్రతివారం డేటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వినియోగదారుల మంత్రిత్వశాఖ కోరింది. ధరలను పెంచేందుకు కొందరు వ్యాపారులు పప్పుధాన్యాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని నివేదికలు అందుతున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలై 12న కందిపప్పు కిలో రూ.100 వరకు ఉండగా.. ఈ నెల శుక్రవారం నాటికి రూ.111కి చేరింది. వచ్చే పండుగల సీజన్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో.. ముందస్తు చర్యలు తీసుకునేందుకు దేశీయ, ప్రపంచ మార్కెట్లో సరఫరా, ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు కంది సాగు 4.2 మిలియన్ హెక్టార్ల నుంచి చేపట్టగా.. 11శాతానికంటే ఎక్కువగా సాగు విస్తీర్ణం తగ్గింది.
ప్రభుత్వ నిర్ణయం కందిపప్పు వాస్తవ నిల్వలను అంచనా వేయడంలో పారదర్శకతను నిర్ధారించడంతో పాటు రాబోయే పండుగల్లో సరఫరాను మెరుగుపరుస్తుందని మహారాష్ట్రకు చెందిన నితిన్ కలంత్రి తెలిపారు. ఉత్పత్తిలో దేశీయ లోటును తీర్చుకునేందుకు భారత్ 202-2022లో మయన్మార్, మొజాంబిక్, మలావి దేశాల నుంచి 0.82 మిలియన్ టన్నుల కంది పప్పును దిగుమతి చేసుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 0.44 టన్నులు దిగుమతి అయ్యింది.
2016లో కందిపప్పు రిటైల్ ధరలు కిలోకు రూ.200కి చేరిన సమయంలో ఏటా 0.2 మిలియన్ టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకునేందుకు మొజాంబిక్తో భారత్ ఎంవోయూ కుదుర్చుకున్నది. అలాగే మయన్మార్, మలావి దేశాలతోనూ పప్పులను దిగుమతి చేసేందుకు ఎంవోయూలు చేసుకున్నది. భారత్ వార్షిక పప్పుధాన్యాల వినియోగంలో దాదాపు 15శాతం దిగుమతి చేసుకుంటుండగా.. 2021-22లో దాదాపు 2ఎంటీల పప్పులు దిగుమతి అయ్యాయి.