న్యూఢిల్లీ: టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. తునీషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే ఆమె సహ నటుడు షీజాన్ ఖాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ్టితో షీజాన్ పోలీస్ కస్టడీ గడువు ముగిసిపోవడంతో పోలీసులు అతడిని ముంబైలోని వసాయ్ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడిని ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని విన్నవించడంతో కోర్టు అతని పోలీస్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది.
ఈ నెల 24న యువ నటి తునీషా శర్మ షూటింగ్ స్పాట్లోనే టాయిలెట్లో ఉరేసుకుని మరణించింది. 25న తెల్లవారుజామున ఆమె సహనటుడు, ప్రియుడు షీజాన్ ఖాన్ను పోలీసులు అరెస్ట్చేసి వసాయ్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఆ నాలుగు రోజులు నిందితుడిని పలు కోణాల్లో ప్రశ్నించారు. నిందితుడి సోదరిని కూడా వాలివ్ పోలీస్స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు.
ఇప్పుడు మరికొన్ని రోజులు నిందితుడి కస్టడీ పొడిగించాలని పోలీసులు కోరడంతో కోర్టు అతడి కస్టడీని రెండు రోజులు పొడిగించింది. దాంతో పోలీసులు మరో రెండు రోజులపాటు షీజాన్ ఖాన్ను ఇంటరాగేట్ చేయనున్నారు. అదేవిధంగా షీజాన్ తల్లిని కూడా పోలీసులు కేసుకు సంబంధించి ప్రశ్నించనున్నట్లు సమాచారం.