Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 20: రెండుసార్లు కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం బీజేపీకి పట్టు దొరకడం లేదు. కర్ణాటకను దాటి ఆ పార్టీ ప్రభావం చూపలేకపోతున్నది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ర్టాల జాబితాలో దక్షిణాది నుంచి కర్ణాటక మాత్రమే ఉంది. 370 స్థానాలను ఒంటరిగా దక్కించుకోవాలనే పట్టుదలగా ఉన్న బీజేపీ.. కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నది. మరోవైపు గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కన్నడనాట కాషాయ పార్టీని నిలువరించాలని అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. దీంతో కర్ణాటకలో రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు ఏప్రిల్ 26, మే 7న ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలో గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లు గెలవగా, కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకుంది. జేడీఎస్ 2 స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ – జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ బీజేపీ 28 స్థానాలకు గానూ 25 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతునిచ్చిన నటి సుమలత ఇండిపెండెంట్గా విజయం సాధించారు. కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. జేడీఎస్ 7 స్థానాల్లో తలపడి ఒకే స్థానానికి పరిమితమైంది.
గత ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా కర్ణాటకలో క్లీన్స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తున్నది. అయితే, సిట్టింగ్ ఎంపీలపై ఉన్న వ్యతిరేకత, బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి మైనస్గా మారాయి. ఏడాది కింది వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణల ప్రభావం ఈ ఎన్నికల్లోనూ చూపించవచ్చు. కాగా, అయోధ్య రామమందిర అంశం ఎన్నికల్లో కలిసొస్తుందని బీజేపీ భావిస్తున్నది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక బలం కూడా బీజేపీకి ప్లస్ అవుతున్నది. పాత మైసూరు(దక్షిణ కర్ణాటక)లో బలమున్న జేడీఎస్తో పొత్తు కూడా బీజేపీకి కలిసిరావచ్చు.
కర్ణాటకలో బీజేపీకి ప్రధాన బలం లింగాయత్ సామాజికవర్గం. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు ఈ వర్గంలో మంచి పట్టుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి నుంచి యెడియూరప్పను తప్పించడం, క్రమంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గించడం వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ వర్గం బీజేపీకి కొంత దూరమైంది. ఇప్పుడు యెడియూరప్ప కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ద్వారా మళ్లీ లింగాయత్ల ఆదరణ పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
కర్ణాటకలో కాంగ్రెస్కు సామాజికవర్గ సమీకరణాలే ప్రధానబలం. సీఎం సిద్ధరామయ్యకు బీసీ, మైనారిటీల్లో మంచి ఆదరణ ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు వొక్కళిగ సామాజికవర్గంలో బలముంది. కర్ణాటకకే చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వల్ల దళిత ఓట్లు కూడా కాంగ్రెస్గా బలంగా మారొచ్చు. కానీ, జాతీయ స్థాయి అంశాలే ప్రధానంగా ప్రభావం చూపే లోక్సభ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కచ్చితంగా పని చేస్తాయని చెప్పలేం. ఇక, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలు తమకు ఓట్లు కురిపిస్తాయని కాంగ్రెస్ ఆశిస్తున్నది. అయితే, ఈ పథకాలు అందరికీ అందకపోవడం, అవినీతి, రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉండటం కాంగ్రెస్కు మైనస్ కావొచ్చు. అంతర్గత విభేదాలు ఇబ్బందికరంగా మారొచ్చు.