MP Sanjay Raut | అయోధ్యలోని రామాలయం ప్రారంభోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో వేడుకలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. శ్రీరాముడి ఉత్సవాలకు బీజేపీ నాయకత్వం ఎవరికీ అవసరం లేదన్నారు. కొద్ది రోజులుగా ప్రధానమంత్రి కార్యాలయం, బీజేపీ కార్యాలయాన్ని అయోధ్య నుంచే నడుపుతున్నట్లు తెలుస్తోందని విమర్శించారు.
ఇది మంచి విషయమే అయినా.. పీఎంఓను అయోధ్యకు మార్చాలంటూ సెటైర్లు వేశారు. ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని బీజేపీ పిలుపు అవసరం లేదని సంజయ్ రౌత్ అన్నారు. అయోధ్యలో శనివారం రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్యలో రోడ్షో నిర్వహించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదేరోజున సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని కోరారు.