న్యూఢిల్లీ, జూలై 2: జన్మతః పౌరసత్వం కేసులో అమెరికా సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బర్త్ టూరిజం(జనన పర్యాటకం)గా పిలిచే దీర్ఘకాలిక సమస్యను ఎదుర్కొనడానికి ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నది. గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించడం వంటి కొత్త ప్రణాళికపై ట్రంప్కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్(మాగా) మిత్రులు దృష్టి పెట్టినట్లు వార్తాకథనాలు సూచిస్తున్నాయి.
బర్త్ టూరిజంకు ఏర్పాటు చేయడంలో సాయపడే సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టడం, తమ సందర్శన ఉద్దేశాన్ని దాచిపెట్టి అమెరికాలోకి ప్రవేశించే మహిళలపై మోసానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేయడం, అంతేగాక గర్భంతో ఉన్న విదేశీ మహిళలను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సహా పలు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారని ఆక్సియోస్ వార్తాసంస్థ కథనం పేర్కొంది. కాగా, జన్మతః లభించే అమెరికన్ పౌరసత్వ విలువను పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్నకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, అందుకే నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్ను ఆదేశించారని వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఆక్సియోస్కు తెలిపారు. జనన పర్యాటక పథకాలపై దర్యాప్తులకు న్యాయ శాఖ కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు.
అమెరికన్ పౌరసత్వాన్ని పరిరక్షించడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద అనేక సాధనాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలా ఉండగా, గర్భవతిగా ఉన్న విదేశీ సందర్శకులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించాలని ఫెడరలిస్ట్ వ్యవస్థాపకుడు సీన్ దేవిస్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ట్రంప్ ఇమిగేషన్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా తాత్కాలిక సందర్శకులపై కఠినమైన తనిఖీలను సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన అయినా సరే మీ దేశంలోకి ఎవరిని అనుమతిస్తున్నారనే విషయమై అమెరికా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ మిల్లర్ అన్నారు.
బర్త్ టూరిజం అంటే విదేశీ సందర్శకులు ప్రధానంగా అమెరికాలో ప్రసవించడం కోసం అక్కడికి ప్రయాణించడం, తద్వారా ఆ దేశపు జన్మతః పౌరసత్వ చట్టం ప్రకారం వారి బిడ్డకు దానంతట అదే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఇటువంటి కేసులను నమోదు చేయనప్పటికీ ప్రైవేట్ అంచనాల ప్రకారం ఏటా విదేశీ సందర్శకులకు సుమారు 20,000 నుండి 26,000 వరకు శిశువులు అమెరికాలో జన్మిస్తున్నారు. ఇదిలా ఉండగా బర్త్ టూరిజం పథకాలపై దర్యాప్తునకు అమెరికా న్యాయశాఖ ఇప్పటికే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను ఆదేశించింది.