న్యూఢిలీ/ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో. కూర్చున్నదేమో శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు. ఎత్తుకొన్నదేమో రాష్ర్టాల అప్పులు, ఉచిత పథకాలు. మరీ ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల అప్పుల వ్యవహారం. శ్రీలంక ఆర్థిక, రాజకీయ పరిణామాలపై మంగళవారం పార్లమెంట్ అపెక్స్ భవనంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రాష్ర్టాలపై కేంద్రం దాడికి వేదికగా మారింది.
ఈ సమావేశానికి పార్లమెంట్లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. మరోవైపు ఈ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిస్సిగ్గుగా రాష్ర్టాలపై దాడికి వేదికగా వాడుకొన్నది.
ముఖ్యంగా కేంద్రం వర్సెస్ తెలంగాణగా చర్చగా దారి మళ్లింది. ముందుగా శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్థిక సహకారం, తదుపరి చర్యలపై విపక్షాలకు విదేశీవ్యవహారాల శాఖమంత్రి జైశంకర్ వివరంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉండటంపై భారత్ ఆందోళన చెందుతున్నదని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంకతో పోల్చదగ్గది కాదని వివరించారు. అంతవరకు బాగానే ఉన్నది.
పనిలో పనిగా ఉచిత పథకాలపై నీతులు మొదలుపెట్టారు. భారత్లో శ్రీలంక తరహా పరిస్థితులు రావని ఓ వైపు ధీమా వ్యక్తంచేస్తూనే ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థలకు ముప్పు ఏర్పడుతున్నదని విదేశీయంలో స్వదేశీయం జోడించారు. అంతటితో ఊరుకోకుండా రాష్ర్టాల అప్పులను ఏకరువు పెట్టారు. రాష్ర్టాలకు ఆర్థిక విజ్ఞత అవసరమని, లేకపోతే సమస్యలు తప్పవని అన్నారు. ఇందులో కేవలం బీజేపీయేతర పాలిత రాష్ర్టాల రుణాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బద్నాం చేయడానికేనా?
అఖిలపక్ష భేటీలో బీజేపీయేతర రాష్ర్టాల రుణాల ప్రస్తావన మాత్రమే తెచ్చి మోదీ సర్కార్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. కేంద్రం తీరును తీవ్రంగా పరిగణించిన టీఆర్ఎస్.. సమావేశంలోనే మోదీ సర్కార్పై నిప్పులు చెరిగింది. కేంద్రానికి దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ లేవనెత్తిన అంశం సరైందేనని మిగతా పక్షాలు ఏకీభవించాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై చర్చిస్తామని పిలిచి, కావాలనే బీజేపీయేతర రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం కురచ బుద్ధిని చూపిందని అఖిలపక్ష సమావేశానికి హాజరైన విపక్షాలు మండిపడ్డాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ రాష్ర్టాల రుణాలపై విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి వివరిస్తున్నపుడే టీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శ్రీలంక దేశ స్థితిగతులపై చర్చిస్తామని పిలిచి బీజేపీయేతర పాలిత రాష్ర్టాలను బద్నాం చేయటమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని కేకే, నామా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రపోషిస్తున్న తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందని, అందుకే శ్రీలంక దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తామని పిలిచి, కావాలనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం కాలరాస్తున్నదని కేశవరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లోబడే తెలంగాణ రుణాలు తీసుకొంటున్నదని, చెల్లించటంలోనూ క్రమశిక్షణను పాటిస్తున్నదని వివరించారు. అంతర్జాతీయ వ్యవహారాలపై ఏర్పాటైన సమావేశంలో ఇలా విపక్ష రాష్ర్టాలను టార్గెట్ చేసుకోవడం ఏమిటని నిలదీశారు. వైసీపీతోపాటు ఇతర విపక్ష పార్టీలూ జైశంకర్ వైఖరిపై ధ్వజమెత్తాయి.
బండారం బయటపెట్టిన నామా
విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అప్పుల రచ్చ మొదలు పెట్టగానే నామా నాగేశ్వర్రావు సమావేశంలో లేచి నిలబడి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఉన్న పళంగా బయటికి వచ్చి కారులో ఉన్న కేంద్ర, రాష్ట్ర గణాంక వివరాలను (టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం కేసీఆర్ ఎంపీలకు అందజేశారు) సమావేశం జరుగుతున్న హాల్లోకి తీసుకొచ్చి కేంద్రం చేసిన అప్పుల బండారాన్ని బయటపెట్టారు.
కేంద్రం జీడీపీలో 59% అప్పులు చేస్తున్నదని, తెలంగాణ జీఎస్డీపీలో 23 శాతమే అప్పు చేసిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ర్టాలకు విధించిన 3.2% ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే తెలంగాణ అప్పు చేసిందని, కానీ కేంద్రం 6.2 శాతానికి మించి చేస్తున్నదని నామా బట్టబయలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో పాలించిన ప్రధానులు చేసిన అప్పు రూ.55,87,149 కోట్లయితే, ఎనిమిదేండ్ల మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లు (కోటి కోట్లు) ఎలా అప్పు చేసిందని నిలదీశారు.
రాజకీయ అస్థిరతపై చర్చించాలి: ఫరూక్ అబ్దుల్లా
బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్రం కావాలనే సతాయిస్తున్నదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీలంకతో పోలిస్తే దేశ ఆర్థికవ్యవస్థ బాగున్నదని చెప్తున్న కేంద్రం.. దేశంలో కావాలనే సృష్టిస్తున్న రాజకీయ అస్థిరతపై చర్చించాలని పట్టుబట్టారు.