న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు రైతు సమస్యలపై చర్చకు లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని,వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.