న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణలో లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతోందని ఎంపీ కేశవరావు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట సేకరణ విధానం వివక్షపూరితంగా ఉందని, తెలంగాణలో పండిన రబీ పంటను కేంద్రం సేకరించడంలేదని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై చర్చ చేపట్టాలని లోక్సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఎంఎస్పీపై చర్చించండి..
ఇతర పార్టీలు కూడా ఇవాళ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రైతు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రాజ్యసభలో సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలతో కూడిన రికార్డును తయారు చేయాలని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మానికమ్ ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. 700 మంది రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రూల్ 267 కింద కనీస మద్దతు ధరపై చర్చ చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి.. కనీస మద్దతు ధరపై చర్చించాలని లోక్సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు.