SP-RLD | ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)-రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) కూటమిలో విభేదాలు బట్టబయలయ్యాయి. బాగ్పట్ లోక్సభ స్థానంలోని మీరట్ జిల్లా శివాల్ఖాస్ స్థానంలో జాట్ నేతలు భగ్గుమంటున్నారు. సీట్ల కేటాయింపులో ఇది ఎస్పీ కోటాలోకి వెళ్లింది. ఈ స్థానం అభ్యర్థిగా గులాం మహమ్మద్ను ఎస్పీ ఎంపిక చేసింది. దీంతో జయంత్ చౌదరిపై ఆర్ఎల్డీలోని టాప్ జాట్ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి పోటీగా మీరట్లోని మరో రెండు స్తానాలు సార్ధానా, హస్తినాపూర్ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా తాము పోరాడితే తగిన ఫలితం దక్కడం లేదన్న భావన జాట్ నేతల్లో పెరుగుతున్నట్లు సమాచారం.
మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, తర్వాత ఆయన కొడుకు అజిత్ సింగ్.. ప్రస్తుతం చరణ్సింగ్ మనుమడు జయంత్ చౌదరికి బాగ్పట్ పెట్టని కోట. శివాల్ఖాస్ స్థానానికి ఆర్ఎల్డీ నేతలు సునీల్ రోహ్తా, రాజ్కుమార్ సంగ్వాన్, యశ్వీర్ సింగ్ పోటీ పడుతున్నారు. కానీ ఈ స్థానాన్ని ఎస్పీకి కేటాయించడంతో వారు కోపంతో రగిలిపోతున్నారు. సాగు చట్టాలపై పోరులో ముందు వరుసలో నిలిచిన జాట్ నేతలందరిలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
ఇదిలా ఉంటే ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నమాట నిజమేనని శివాల్ఖాస్ అభ్యర్థి గులాం మహ్మద్ అంగీకరించారు. ఒకవేళ తనకు టికెట్ రాకపోతే తమ కార్యకర్తల్లో కొందరు భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్ఎల్డీ నేతలూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉండవచ్చు అని చెప్పారు. తామంతా రైతు కుటుంబాలు. రైతుల ఉద్యమంలో చౌదరి సామాజిక వర్గ నేతలు చురుగ్గా పాల్గొన్నారు. వారికి ముస్లిం రైతులు కూడా మద్దతు ఇచ్చారని గులాం మహ్మద్ చెప్పారు.
2017లో జరిగిన ఎన్నికల్లో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే గులాం మహమ్మద్పై బీజేపీ అభ్యర్థి జితేంద్రపాల్ సింగ్ 13,990 ఓట్ల తేడాతో గెలిచారు. ఆర్ఎల్డీ అభ్యర్థి రన్వీర్ రాణా నాలుగో స్థానంలో ఉన్నారు. 2002లో రాణా విజయం సాధించారు. కానీ 2007లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఈ సీటు కోసం పోటీ పడుతున్న సునీల్ రోహ్తా.. పశ్చిమ యూపీలో పాపులర్ కూడా. ఇదిలా ఉంటే, జాట్లు, స్థానిక రైతుల మధ్య ఘర్షణను బీజేపీ ఆసక్తిగా గమనిస్తున్నది.
శివాల్ఖాస్ స్థానంలో 25 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. కానీ ఎస్పీ అభ్యర్థిని ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఘర్షణతో బీజేపీకి లబ్ధి చేకూరుతుందేమోనని ముస్లింలు భయపడుతున్నట్లు సమాచారం. పశ్చిమ యూపీలో తొలి దశలో 29 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆర్ఎల్డీ 19, ఎస్పీ 10 స్థానాలకు పోటీ చేయనున్నది. రెండో జాబితాలో ఆర్ఎల్డీకి ఏడు సీట్లు వచ్చాయి. దీంతో ఆర్ఎల్డీ 26 స్థానాల్లో పోటీ చేస్తుంది. మెజారిటీ సీట్లలో జాట్లు, ముస్లిం నేతలే పోటీ చేస్తున్నారు. 10 స్థానాల్లో ముస్లింలు, ఏడు చోట్ల జాట్ నేతలు పోటీ చేస్తున్నారు. వచ్చేనెల 10న తొలి దశ పోలింగ్ జరుగనున్నది.