Trouble In Punjab Congress | ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా?.. ఆ పార్టీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత రన్వీత్ సింగ్ బిట్టూ సోమవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారా? అన్న సందేహాలు వచ్చాయి. ప్రధాని మోదీతో భేటీలో పంజాబ్ సమస్యలపై చర్చించామన్నారు. ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం రన్వీత్ సింగ్ బిట్టూ.. బీజేపీలో చేరబోరని పేర్కొన్నాయి. పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై ఆయన పోరాడాలని ప్రధాని కోరుతున్నారని చెప్పాయి.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో హిందూ నేతల్లో రన్వీత్ సింగ్ బిట్టూ ఒకరు. 1995లో ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనుమడే రన్వీత్ సింగ్. ప్రధాని మోదీతో భేటీ దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు రన్వీత్ సింగ్ బిట్టూ. ఈ రోజు గౌరవనీయ ప్రధానమంత్రితో సమావేశం అయ్యా. పంజాబ్ అంశాలను చర్చించా అని క్యాప్షన్ పెట్టారు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి పంజాబ్ కాంగ్రెస్ పూర్తిగా సైలెండ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ప్రధాని మోదీతో రన్వీత్ భేటీపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు అతిగా ఊహించుకోవద్దని సంకేతాలిచ్చారు.