న్యూఢిల్లీ: త్రిపుర రాజధాని అగర్తలాలో బాంబు కలకలం చెలరేగింది. ఈ ఉదయం 9.45 గంటలకు అగర్తలా ఎయిర్పోర్టులో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో ఆ బ్యాగులో బాంబులు ఉన్నాయేమో అనే అనుమానంతో బాంబ్ స్క్వాడ్ను రప్పించారు. బ్యాగును పరిశీలించిన బాంబ్ స్క్వాడ్ అందులో బాంబులేమీ లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
త్రిపురలో ఈ నెల 25న అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్తోపాటు మరో 12 మున్సిపల్ బాడీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బీజేపీ, తృణమూల్ రోడ్ షోలకు ఇవాళ అనుమతి నిరాకరించారు. కేవలం గల్లీల్లో ప్రచారానికి మాత్రమే అనుమతించారు.