అగర్తలా: సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టడం (lions Akbar, Sita) వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో త్రిపుర అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేశారు. సీనియర్ అటవీ శాఖ, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్పై త్రిపుర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. త్రిపురలోని సెపాహిజాలా జూకు చెందిన రెండు సింహాలను ఇటీవల పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని బెంగాల్ సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. అక్బర్ పేరున్న మగ సింహం, సీత పేరున్న ఆడ సింహాన్ని ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు.
కాగా, బెంగాల్ వీహెచ్పీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలను కించపరిచనట్లు ఆరోపించింది. సింహాల పేర్లు మార్చాలని డిమాండ్ చేస్తూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు బెంగాల్ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. అయితే త్రిపుర జూ నుంచి వచ్చిన ఆ రెండు సింహాలకు అవి పుట్టిన 2016, 2018లో ఆయా పేర్లు పెట్టినట్లు కోర్టుకు తెలిపింది. తాము కొత్తగా వాటికి ఎలాంటి పేర్లు పెట్టలేదని వివరణ ఇచ్చింది.
మరోవైపు వాదనలు విన్న హైకోర్టు సింహాల పేర్లు మార్చాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ , చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అయిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్ను త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అగర్తలాను వీడి వెళ్లవద్దని ఆయనను ఆదేశించింది.