అగర్తలా: అవసరమైతే రాష్ట్ర రాజధాని అగర్తలాలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ (HIV) పరీక్షలు నిర్వహించాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా పట్టణంలో భారీగా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో అగర్తలాలోని కాలేజీల్లో ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, డ్రగ్స్ మూలాలను కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ప్రముఖ కాలేజీల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల ప్రతికూల మనస్తత్వం ఏర్పడుతుందని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు దుర్వ్యసనాల బాటపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అగర్తలాలోని జీబీపీ దవాఖానలో ప్రతిరోజూ మూడు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని దేవ్ చెప్పారు. పరిస్థితిని అదుపుచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రం నుంచి హెచ్ఐవీని పూర్తిగా నిర్మూలించడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ కమిటీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 2459 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 750 మంది మహిళలు, 1709 మంది పురుషులు ఉన్నారు. గత 20 ఏండ్లలో 640 మంది హెచ్ఐపీ వ్యాధిగ్రస్తులు మరణించారు.