కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు అసలు పడటం లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యే ఎముకలే విరగ్గొడుతానని మరో ఎమ్మెల్యే అంటున్నారు.
భరత్పూర్ టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రేజీనగర్ ఎమ్మెల్యే రబీయుల్ అలాం చౌదరిని(టీఎంసీ) హెచ్చరించారు. అలాం చౌదరికి అహంకారం నెత్తికెక్కింది. చాలా గర్వంతో మాట్లాడుతున్నారు. తనకు అడ్డువస్తే తగిన గుణపాఠం చెబుతాను. ఆ ఎమ్మెల్యే ఎముకలు తప్పకుండా విరగ్గొడుతాను. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. తమరు నీటిలో ఉండాలనుకుంటే.. మొసలితో ఫైట్ చేయాలనుకోవద్దు అని కబీర్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే కబీర్ వ్యాఖ్యలపై టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కబీర్కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కబీర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అలాం చౌదరి స్పందించారు. కబీర్ చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఈ విషయంలో సరైన సమయంలో పార్టీ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.