శ్రీనగర్: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 30 సంవత్సరాల తర్వాత శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద ఉన్న క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకం ఎగిరింది. క్రేన్ సహాయంతో క్లాక్టవర్పైకి చేరుకున్న స్థానికులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీనగర్లోని క్లాక్ టవర్ (ఘంటా ఘర్)పై జాతీయ జెండాను ఎగురవేయడం ఇదే తొలిసారి.
కశ్మీర్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల రాజధాని శ్రీనగర్లోని లాల్ చౌక్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి విజయవంతం కాలేదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా ఈ ప్రాంతం సున్నితత్వాన్ని పేర్కొంటూ ఇక్కడ జెండాను ఆవిష్కరించేందుకు అధికారులు అనుమతిని నిరాకరించేవారు.
అయితే 30 ఏండ్ల కిందట అంటే 1992లో, కశ్మీర్ లోయలో తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తొలిసారిగా శ్రీనగర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగురవేశారు. నాటి నుండి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా దశాబ్దాలుగా లాల్చౌక్లో జెండా ఆవిష్కరణ అంశం వివాదాస్పదంగా ఉన్నది.
మరోవైపు, దేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాల్ చౌక్ ప్రాంతంలో జెండాను ఎగురవేయాలని స్థానికులే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ అనే ఇద్దరు క్రేన్ సహాయంతో క్లాక్ టవర్పైకి చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మహిళలతోపాటు చిన్నారులు జాతీయ జెండాలను చేతపట్టుకుని రెపరెపలాడించారు. దేశ సమైఖ్యతను చాటారు.