న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారతదేశ సైనిక చరిత్రలో ఓ యోధుడి ప్రస్థానం ముగిసింది. సైనిక దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్కు యావత్ దేశం శుక్రవారం కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు రావత్ పేరు నిలిచి ఉంటుంది’ అని నినదించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. ఢిల్లీలో కంటోన్మెంట్ ఏరియాలోని బ్రార్ స్కేర్ శ్మశాన వాటికలో వారికి అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తెలు కృతిక, తరిణి తలకొరివి పెట్టారు. బిపిన్ రావత్ సోదరుడు విజయ్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రావత్ అంతిమ సంస్కారాలు పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. సైన్యం ఆయనకు 17 గన్ సెల్యూట్ (17 సార్లు శతఘ్నులను గాల్లోకి కాల్చారు) చేసింది. ఇందులో 800 మంది సర్వీసు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తదితరులు రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోట్లాది ప్రజలు టీవీల్లో చూసి రావత్కు నివాళులర్పించారు.
జస్టిస్ రమణ నివాళి
అంతకుముందు ప్రజల సందర్శనార్థం రావత్ దంపతుల పార్థివ దేహాలను కామరాజ్ మార్గ్లోని ఆయన నివాసంలో ఉంచారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్, రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి, పలు దేశాలకు చెందిన ఆర్మీ కమాండర్లు బిపిన్ రావత్కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. రెండు గంటల తర్వాత శ్మశాన వాటికకు చేరుకొన్నది. తమ తల్లిదండ్రుల చితా భస్మాన్ని, అస్థికలను శనివారం హరిద్వార్ తీసుకెళ్తామని అక్కడ గంగా నదిలో కలుపుతామని తరిణి తెలిపారు. కాగా, ప్రమాదంలో మరణించిన బ్రిగేడియర్ లిద్దర్ అంత్యక్రియలను కూడా బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలోనే శుక్రవారం ఉదయం నిర్వహించారు.
రైతుల యాగం
బిపిన్ రావత్ దంపతులు, ప్రమాదంలో మరణించిన సైనికులకు రైతులు నివాళులర్పించారు. వారి ఆత్మశాంతి కోసం ఘాజీపూర్ వద్ద నిరసన కేంద్రాల్లో యాగం నిర్వహించారు. ఈ యాగంలో రైతు నేత రాకేశ్ టికాయిత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో మరణించిన సైనికుల మృతదేహాల గుర్తింపు చాలా కష్టంగా మారింది. ఇప్పటి వరకు ముగ్గురినే గుర్తించారు. మిగతా వారిని డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించనున్నట్టు సమాచారం.