భోపాల్, జూలై 4: గిరిజన మహిళకు దేశ అత్యున్నత స్థానంలో కూర్చొనే అవకాశం కల్పించామంటూ గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీ.. పగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో గిరిజన మహిళలకు ఘోర అవమానం జరిగింది. మహిళల రక్షణపై కమలదళానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ఘటనలతో అర్థమవుతున్నది.
15 ఏండ్లకే పెండ్లి.. అనంతరం హింస
మధ్యప్రదేశ్లోని దివాస్ జిల్లాకు చెందిన ఓ 30 ఏండ్ల గిరిజన మహిళను గ్రామస్తులు తీవ్రంగా చితకబాదారు. అనంతరం ఆమె మెడలో చెప్పుల దండ వేసి, ఆమె భర్తను భుజాలపై కూర్చోబెట్టి ఊరేగించారు. నాలుగైదు రోజులుగా ఆ మహిళ కనిపించకుండా పోయిందని, ఆ తర్వాత వేరే వ్యక్తితో ఉండటాన్ని గుర్తించినట్టు భర్త, గ్రామస్థులు చెప్పారు. అనుమానంతో ఆమెను తీవ్రంగా హింసించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్తతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు 15 ఏండ్ల వయసులోనే పెండ్లి చేశారని, అప్పటి నుంచి తన భర్త చిత్రహింసలు పెడుతుండేవాడని బాధితురాలు వాపోయింది. తట్టుకోలేక స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నానని, ఏ తప్పూ చేయలేదని తెలిపింది.
భూకబ్జాను అడ్డుకోవడంతో మహిళకు నిప్పు
తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది. బమోరి తహశీల్ పరిధిలోని ధనోరియా గ్రామ పొలంలో మహిళకు నిప్పంటించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటన చాలా సిగ్గు చేటని వ్యాఖ్యానించింది. పట్టపగలే దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది.