న్యూఢిల్లీ: జోగమ్మ హెరిటేజ్కు చెందిన ట్రాన్స్జెండర్, జానపద నృత్యకారిణి మాతా బీ మంజమ్మ జోగతి ( Manjamma Jogati ) ఇవాళ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్విమెన్గా మంజమ్మ జోగతి గుర్తింపు పొందారు. అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తనదైన స్టైల్లో ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి, మంజమ్మ జోగతి నవ్వుతూ ఏదో మాట్లాడుకోవడం కనిపించింది. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆమె పేరు పిలువగానే వేదిక ఎదురుగా ముందు వరుసలో కూర్చున్న ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్షాకు నమస్కరించి ఆమె రాష్ట్రపతి వైపు వెళ్లారు. మంజమ్మ జోగతి హావభావాలకు ముగ్ధులై అందరూ చిరునవ్వులు చిందించారు.