న్యూఢిల్లీ/పాట్నా, జూన్ 21: అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు. అగ్నిపథ్పై వెనక్కు తగ్గేది లేదని స్పష్టంచేశారు. రెగ్యులర్ సైనికులుగా ఎంపికైన అగ్నివీరులను మరోసారి శిక్షణ ఉంటుందని తెలిపారు. మరోవైపు, అగ్నిపథ్ పథకం ప్రకటన నేపథ్యంలో సైన్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించి నెలకొన్న సందేహాలపై రక్షణశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని, సైన్యంలో సంప్రదాయ రెజిమెంటేషన్ వ్యవస్థ కొనసాగుతుందని లెఫ్టినెంట్ జనరల్, సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి అనిల్ పురి పేర్కొన్నారు. మంగళవారం ఆయన త్రివిధ దళాల అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకునే వారందరూ ఎటువంటి హింసాత్మక ఘటనల్లో తాను పాల్గొనలేదని హమీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా పోలీస్ వెరిఫికేషన్ అనేది ఎప్పటికీ ఉంటుందని అనిల్ పురి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సుప్రీంలో కేంద్రం కేవియట్
అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్ పిటిషన్లపై ఏవైనా ఉత్తర్వులు జారీచేసే ముందు తమ వాదనలు కూడా వినాలని కోరింది. మరోవైపు అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిల్ను సీజేఐనిర్ణయం తీసుకున్న తర్వాతనే విచారణను లిస్టింగ్ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ముందు మాజీ జవాన్లకు ఉద్యోగాలివ్వండి
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్కు పలువురు కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు మద్దతు పలకడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఘాటుగా స్పందించారు. ముందు ఇప్పటికే రిటైర్డ్ అయివున్న సైనికులకు ఉపాధి కల్పించి వారు అగ్నివీరులకు ఇచ్చిన హామీ నిజాయితీ, నిబద్ధతను నిరూపించుకోవాలని హితవు పలికారు. తద్వారానే నాలుగేండ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులు వారి మాటలు నమ్ముతారని అన్నారు. ఈ మేరకు అగ్నిపథ్కు మద్దతు పలికే వారికి రిటైర్డ్ సైనికుల లిస్టు పంపుతామని ట్విట్టర్లో పేర్కొన్నారు. నమ్మకం అనేది మాటలతో రాదని, చర్యల ద్వారానే ఉంటుందని అఖిలేశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మోదీ దిష్టిబొమ్మ దహనం
దేశంలో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో చెన్నైలోని ఆర్మీ దక్షిణ భారత హెడ్క్వార్టర్ వద్ద ఆందోళనకారులు నిరసన చేపట్టారు. తాంథై పెరియార్ ద్రవిడార్ కజగం(టీపీడీకే) కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగ్నిపథ్ పథకం కులతత్వాన్ని పెంచి, యువత జీవితాలను నాశనం చేస్తుందని టీపీడీకే అరియలూర్ జిల్లా కార్యదర్శి రావణ గోపాల్ అన్నారు.