Train Ticket Concessions | సీనియర్ సిటిజన్లకు రైళ్లలో టికెట్లపై రాయితీకి ఎత్తివేసి.. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది రైల్వేశాఖ. విమర్శలకు తలొగ్గిన కేంద్రం.. రాయితీని పునరుద్ధరించే అంశంపై పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో రాయితీ అందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రాయితీపై పలుమార్పులు చేయాలని యోచిస్తున్నది. జనరల్, స్లీపర్ క్లాసుల వరకే టికెట్ల చార్జీల్లో రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘రాయితీలు వృద్ధులకు సహాయపడుతాయని తాము అర్థం చేసుకున్నామని, రాయితీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. దీనిపై సమీక్షిస్తున్నాం. నిర్ణయం తీసుకుంటాం’ అని రైల్వే పేర్కొంది.
రైల్వే బోర్డు సీనియర్ సిటిజన్ సబ్సిడీని 70 సంవత్సరాలు పైబడిన వారికి వర్తింపజేసేందుకు ఆలోచిస్తున్నది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో చార్జీలపై రాయితీని ఉపసంహరించే సమయంలో 58 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు 50శాతం.. 60 సంవత్సరాలుపైబడిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు అన్ని కేటగిరిల్లో 40శాతం రాయితీని ఇచ్చింది. రాయితీపై వయోపరిమితి పెంపుతో పాటు మరో నిబంధనను సైతం మార్చేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తున్నది. సబ్సిడీని నాన్-ఏసీ వరకే పరిమితం చేయాలని యోచిస్తున్నది. స్లీపర్, జనరల్ కేటగిరీకి పరిమితం చేస్తే.. 70శాతం మంది ప్రయాణికులకు అందుతుందని భావిస్తున్నది.
దీంతో పాటు అన్ని రైళ్లలోనూ ‘ప్రీమియం తత్కాల్’ పథకాన్ని ప్రారంభించాలని రైల్వేశాఖ ఆలోచిస్తున్నది. తద్వారా మరింత ఆదాయం సమకూరడంతో పాటు రాయితీల భారం తగ్గుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ప్రీమియం తత్కాల్ స్కీమ్ కేవలం 80శాతం రైళ్లలోనే కొనసాగుతున్నది. గత రెండు దశాబ్దాలుగా రైల్వే రాయితీలు చర్చనీయాంశంగానే మారుతున్నాయి. ఇందుకు సంబంధించి పలు కమిటీలు రాయితీని ఉపసంహరించుకోవాలని రైల్వేశాఖకు సిఫారసు చేశాయి. వివిధ రకాల ప్రయాణికులకు 50కిపైగా రకాల రాయితీల కారణంగా రైల్వేలు ఏటా దాదాపు రూ.2వేలకోట్ల భారాన్ని మోయాల్సి వస్తున్నది.
సీనియర్ సిటిజన్ రాయితీ అది ఇచ్చిన మొత్తం మినహాయింపులో దాదాపు 80శాతం. ఇంతకుముందు, సీనియర్ సిటిజన్లు రాయితీని వదులుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు రైల్వేలు ప్రయత్నించినా.. అవి విజయవంతం కాలేదు. గత వారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా.. రాయితీలు ఇవ్వడానికి అయ్యే ఖర్చు.. రైల్వేలను మించిపోతుందని అన్నారు. ఈ కారణంగా సీనియర్ సిటిజన్లతో సహా అన్ని కేటగిరీల ప్రయాణికులకు రాయితీ విస్తరించడం సరికాదన్నారు.