Viral Video | రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి ఓ గూడ్స్ రైలు రావడంతో ఆమె పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. ఊహించని ఈ పరిణామంతో సదరు మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్ రాష్ట్రంలోని గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్లో ఓ గూడ్స్ రైలు ఆగింది. ఆ సమయంలో ప్లాట్ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఆగిన గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు పట్టాలపై పడుకుండిపోయింది.
రైలు ఆమెపై నుంచి వెళ్లిపోయింది. అనంతరం అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు పరుగున వెళ్లి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు సదరు మహిళను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.