చెన్నై: తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి వెళ్లిపోయింది. అయితే డబ్బాలు విడివడటాన్ని గుర్తించిన లోకోపైలట్ రైలును తర్వాతి స్టేషన్లో ఆపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ ఎక్స్ప్రెస్ రైలు చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్నది. ఈ క్రమంలో తిరువళ్లూరు స్టేషన్ దాటుతుండగా ప్రయాణికులకు భారీ శబ్ధం వినిపించింది. బోగీల మధ్య అనుసంధానంగా ఉండే కప్లింగ్ పిన్ ఊడిపోయింది. దీంతో ఎస్7, ఎస్8 కోచ్లు రైలు నుంచి విడిపోయాయి. దీంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత గుర్తించిన లోకోపైలట్ రైలును ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మళ్లీ రెండు బోగీలను రైలుకు కలిపారు. కప్లింగ్ పిన్ ఊడిపోవడంతోనే బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు వెల్లడించారు.