ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర కొత్త సీఎంగా గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆటో డ్రైవర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు కాలం, అదృష్టం కలిసి రావడంతో ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన షిండే, మరాఠా సమాజానికి చెందినవారు. ఆయన కుటుంబం జీవనోపాధి కోసం థానేకు మారింది. దీంతో ఏకనాథ్ షిండే 11వ తరగతి వరకు థానేలోని మంగళ హై స్కూల్, జూనియర్ కాలేజీలో చదివారు. అనంతరం జీవనోపాధి కోసం కూలీ పనులు చేశారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి థానేలో ఆటో నడిపారు.
కాగా, స్కూల్ స్థాయి నుంచే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు షిండే ప్రభావితమయ్యారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980 ఆరంభంలో నాటి థానే శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘేను పరిచయం చేసుకున్నారు. ఆయన మద్దతుతో శివ సైనికుడిగా ఆ పార్టీలో చేరారు. 1980లో వాగ్లే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కార్మిక నాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. శివసేన ఆందోళనల్లో ముందుండే ముందుండే ఆయన, బెల్గావిపై మహారాష్ట్ర-కర్ణాటక మధ్య ఆందోళనల సమయంలో అరెస్టై 40 రోజుల పాటు జైలులో ఉన్నారు.
1997లో తొలి రాజకీయ పీఠాన్ని షిండే అధిరోహించారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో కోప్రి పంచపఖాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పట్ల దూకుడుగా వ్యవహరించే వ్యక్తిగా పేరుగాంచిన షిండే శివసేనలో కీలకంగా ఎదిగారు. ముంబైకి ఆనుకుని ఉన్న థానే-పాల్ఘర్ ప్రాంతంలో కీలకమైన సేన నాయకుడిగా రాణించారు. బాలాసాహెబ్కు గట్టి మద్దతుదారుగా, ఆయన అనుచరుడిగా, శివసేన వ్యవస్థాపకుడి సిద్ధాంతాల ఉద్రేకంతో నడిచే సైనికుడిగా తనను తాను నిరూపించుకున్నారు.
మరోవైపు షిండే వ్యక్తిగత జీవితం విషాదమయం. ఆయనకు లతతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. అయితే 2000 జూన్ 2న షిండే స్వగ్రామం సమీపంలోని సరస్సులో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు పిల్లలైన 11 ఏళ్ల కుమారుడు దీపేష్, 7 ఏళ్ల కుమార్తె శుభద నీట మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలను కోల్పోయిన షిండే చాలా కాలం డిప్రెషన్లో ఉన్నారు.
అయితే ఇదే ఆయనను రాజకీయంగా కీలక మలుపు తిప్పింది. డిప్రెషన్ నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు రాజకీయ గురువు ఆనంద్ డిఘే, 2001లో ఆయనను థానే మున్సిపల్ కార్పొరేషన్ సభా నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ మలుపు ఆయన స్థావరమైన థానే జిల్లాను ఏకీకృతం చేయడంలో దోహదపడింది. ఆపై షిండే వెనక్కి తిరిగి చూసుకోలేదు. శివసేనలో సీనియర్గా, కీలక నేతగా, అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా, చివరకు ఆ పార్టీని చీల్చే రెబల్ నాయకుడిగా ఎదిగిన ఆయన అనంతర పరిణామాలతో ఏకంగా మహారాష్ట్రకు సీఎం అయ్యారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు శ్రీకాంత్ ఆర్థోపెడిక్ సర్జన్. కళ్యాణ్ నుంచి రెండవసారి ఎంపీగా ఉన్నారు.
కాగా, శివసేనలో అట్టడుగు స్థాయి నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఏక్నాథ్ షిండే ఆ పదవిలో ఎంత కాలం కొనసాగుతారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకతను తట్టుకుని ఎలా నిలబడతారు అన్నది ప్రశ్నగా మారింది.