Himachal | వారాంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తుతున్నారు. వివిధ రాష్ర్టాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్కు జనం బారులు తీరుతున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు (traffic jam) తలెత్తాయి. దీంతో ఓ వ్యక్తి ట్రాఫిక్ జంఝాటాన్ని తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకి కారును పోనిచ్చాడు.
లాహౌల్ వ్యాలీలోని చంద్రా నదిలో మహీంద్రా థార్ ఎస్యూవీ (Mahindra Thar SUV) వాహనాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సమయంలో నదిలో నీరు పెద్దగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే ఆ పర్యాటకుడి నిర్లక్ష్య పూరిత వైఖరిపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో వారు.. సదరు డ్రైవర్పై మోటార్ వాహనాల చట్టం-1988 కింద కేసు నమోదు చేశారు.
“Outrageous scene near Sissu in Himachal as a tourist brazenly drives into the Chandra river, displaying a shocking disregard for the fragile ecosystem. To all visitors: these areas aren’t a playground for your antics! Urgent call to @himachalpolice and the government to crack… pic.twitter.com/406ZGWAwPd
— Nikhil saini (@iNikhilsaini) December 24, 2023
వరుస పండుగలు, వారాంతం కావడంతో గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాహౌల్ నుంచి మనాలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మనాలి, కాసోల్, సిమ్లా సహా పలు ప్రదేశాల్లోనూ పర్యాటకులు నానా అవస్థలకు గురయ్యారు. సుందరమైన కొండ ప్రాంతాల్లో పండుగ సెలవుల్ని గడుపుదామని వచ్చిన పర్యాటకుల్ని అక్కడి ట్రాఫిక్ పరిస్థితి నిరాశపర్చింది. జాతీయ రహదారులపై టోల్ బూత్ల వద్ద గంటల కొద్దీ వాహనాల్ని నిలపలేక ఇబ్బందిపడ్డారు.
కులు, లాహౌల్, స్పితిలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్తంగ్లోని అటల్ సొరంగం (Atal tunnel) గుండా మూడు రోజుల్లో 55,000 కంటే ఎక్కువ వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలో 28,210 వాహనాలు అటల్ సొరంగాన్ని దాటాయి. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
లాహౌల్, స్పితి జిల్లాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని జిల్లా యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం లాహౌల్, స్పితి జిల్లాల్లో పోలీసులు డ్రోన్ సహాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారిపైన అటల్ టన్నెల్ నుంచి మనాలి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కనీసం పార్కింగ్కు అవకాశం లేకుండా ఉందని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Praja Bhavan | ప్రజభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు..
AUS vs PAK | బాక్సింగ్ డే టెస్టుకు వర్షం అంతరాయం.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
Nigeria | సెంట్రల్ నైజీరియాలో కాల్పులు.. 160 మంది మృతి