గౌహతి: సాధారణంగా అమెరికాలో బీభత్సం సృష్టించే సుడిగాలి అస్సాంలో ప్రతాపం చూపింది. చాలా తక్కువ తీవ్రత ఉన్న సుడిగాలి బార్పేట జిల్లాలో శనివారం కలకలం రేపింది. చెంగా ప్రాంతంలోని రౌమారి గ్రామంలో ఉదయం 10.20 ఇది సంభవించింది. సుడిగాలి వల్ల ఆ గ్రామంలోని ఏడు గుడిసెలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని బార్పేట డిప్యూటీ కమిషనర్ తేజ్ ప్రసాద్ భూషాల్ తెలిపారు. ఈ సుడిగాలి బ్రహ్మపుత్ర నది ఒడ్డు నుంచి ప్రారంభమైందని చెప్పారు. రౌమారి గ్రామానికి సమీపంలోనే చాలా చిన్న ప్రాంతానికి ఇది పరిమితమైందని అన్నారు. దీంతో పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదని వెల్లడించారు.
కాగా, దేశంలో సుడిగాలులు చాలా అరుదుగా సంభవిస్తాయని గౌహతిలోని వాతావరణ శాఖ అధికారి సునీత్ దాస్ తెలిపారు. అయితే సుడిగాలి వచ్చిన ప్రాంతంలో వాతావరణ పరిశీలన కేంద్రం లేదని చెప్పారు. దీంతో చాలా తక్కువ స్థాయిలో ఏర్పడిన ఈ సుడిగాలి గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నారు. మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ సుడిగాలి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.