న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అమృత కాలంలో తొలి బడ్జెట్ అంటూ పార్లమెంట్లో బుధవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్ను ఆమె లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆత్మనిర్భర్ నినాదం, అందరికీ అభివృద్ధి అనే నినాదాలతో గత నాలుగు బడ్జెట్లనూ నిర్మలా సీతారామన్ సభ ముందుంచారు. గత కొన్ని బడ్జెట్లను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ పలు కోట్స్ను ఉదహరించారు.
2020లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ మన ప్రజలకు ఉపాధి అవకాశాలు దక్కాలి..వ్యాపారాలు మైనారిటీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసేలా ఉండాలని ఈ బడ్జెట్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 2021లో కొవిడ్-19 వ్యాప్తి అనంతరం తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతూ మహమ్మారితో గతంలో ఎన్నడూ చూడని పరిస్ధితుల నడుమ ఈ బడ్జెట్ను సభ ముందుకు తెచ్చామని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్ను ఆమె ప్రస్తావించారు. విశ్వాసం అంటే తెలవారుతుండగా ఇంకా చీకటి తెరల్లోనే వెలుగును చూసే పక్షి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
కేంద్ర బడ్జెట్ 2020 ప్రవేశపెట్టే క్రమంలో నిర్మలా సీతారామన్ సాహిత్య అకాడమీ విజేత దీన నాధ్ కౌల్ పద్యాన్ని ఉటంకించారు. మన దేశం వికసించిన షాలిమార్ బాగ్ లాంటిది, మన దేశం దాల్ సరస్సులో వికసించిన కమలం వంటిది, ఇది యువత మరుగుతున్న రక్తం లాంటిది, నా దేశం, మీ దేశం, ప్రపంచంలో అత్యంత ప్రియమైన దేశమని వ్యాఖ్యానించారు. 2022 బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యక్ష పన్నుల గురించి తెలుపుతూ ఆమె మహాభారతంలో ఓ పద్యాన్ని ప్రస్తావించారు.
ధర్మాన్ని అనుసరించి రాజు పన్నులను వసూలు చేయాలని మహాభారతంలోని శాంతి పర్వాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఇక నిర్మలా సీతారామన్ 2019లో తన తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతూ చాణక్య నీతిని, ఉర్ధూ కవి మంజూర్ హష్మీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. బసవేశ్వర బోధనలనూ ఉటంకించారు. అంకితభావంతో మనిషి చేసే కర్మలతో లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని చాణక్యనీతిలోని వాక్యాలను నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.