Pramod Mishra | రాంచీ : మావోయిస్టు అగ్రనేత, పొలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమోద్ మిశ్రాపై జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించడానికి కీలకపాత్ర పోషించారు.
జార్ఖండ్ – బీహార్ రాష్ట్రాల సరిహద్దుల్లోని గయా జిల్లాలో మిశ్రా తలదాచుకున్నారు. కొన్ని నెలల క్రితం వరకు జార్ఖండ్లోని సరందా ఏరియాలో కీలకంగా వ్యవహరించారు. మిశ్రాతో పాటు ఆయన మద్దతుదారుడు అనిల్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మిశ్రా అరెస్టును ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఇక మావోయిస్టు కార్యకలాపాల్లో ప్రమోద్ మిశ్రా మాస్టర్మైండ్, ప్రముఖ వ్యూహకర్తగా పని చేశారు.