శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూ (Yousuf Kantroo) హతమయ్యాడు. బారాముల్లాలోని వాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుద్గాం పోలీసులు, భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిజగా జరిపిన కాల్పుల్లో లష్కరే కమాండర్ యూసుఫ్ మృతిచెందాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. బుద్గాం జిల్లాలో ఎస్పీవో, అతని సోదరుడు, సాధారణ పౌరులను చంపడంలో అతని పాత్రకూడా ఉందన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని చెప్పారు. వారిని దవాఖానకు తరలించామని, ప్రస్తుతం వారి క్షేమంగా ఉన్నారని తెలిపారు.