న్యూఢిల్లీ, డిసెంబర్ 2: సాధారణంగా లైంగిక దాడి కేసుల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. అయితే ఒక మహిళపై రేప్ కేసు నమోదు చేయవచ్చా? ఈ అంశాన్ని పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్కు 61 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించి, దీనిపై మీ ప్రతిస్పందన తెలియజేయాలంటూ జస్టిస్లు హృషికేశ్ రాయ్, సంజయ్ కరోల్ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ మహిళకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ, కేసు విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. కేసు వివరాలు పరిశీలిస్తే.. పిటిషనర్ పెద్దకొడుకు అమెరికాలో నివసిస్తున్నాడు. అతను ఒక మహిళలను వర్చువల్గా వివాహం చేసుకున్నాడు. అతనెప్పుడూ భారత్కు రాలేదు. ఆ మహిళ, అత్తగారితో కలిసి నివసిస్తున్నది. కొద్ది రోజుల క్రితం పోర్చుగల్ నుంచి వచ్చిన ఆమె చిన్న కొడుకు లైంగిక దాడి చేశాడని, దానికి తన అత్త కూడా సహకరించారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది.