న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడ్ని పెళ్లికి తీసుకెళ్లిన స్నేహితులు అనంతరం హత్య చేశారు. (Top Police’s Son Killed) కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ పోలీస్ అధికారి ఆందోళన చెందాడు. ఆయన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్ కుమారుడు 24 ఏళ్ల లక్ష్య చౌహాన్, తీస్ హజారీ కోర్టులో న్యాయవాది. సోమవారం తన స్నేహితుడైన వికాస్ భరద్వాజ్, అతడి సహచరుడు అభిషేక్తో కలిసి హర్యానాలోని సోనేపట్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు.
కాగా, ఆందోళన చెందిన తండ్రి అయిన పోలీస్ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అభిషేక్ను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. చౌహాన్ అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో అతడ్ని అంతం చేయాలని భరద్వాజ్ ప్లాన్ వేసినట్లు తెలిపాడు. తనకు ఈ విషయం చెప్పినట్లు వెల్లడించాడు.
వివాహ వేడుక తర్వాత కారులో తిరిగి వస్తుండగా మునక్ కాలువ వద్ద మూత్ర విసర్జన కోసం ఆగినట్లు అభిషేక్ తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు.