BS Yediyurappa | వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శిఖారిపురా స్థానం నుంచి పోటీపై కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప మరో షాకింగ్ ప్రకటన చేశారు. ఆ స్థానం నుంచి తన తనయుడు బీవై విజయేంద్ర పోటీపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలదే తుది నిర్ణయం అని శనివారం మీడియాకు చెప్పారు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని శుక్రవారం యెడ్యూరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్థానంలో తన కొడుకు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని కూడా చెప్పారు.
అయితే విజయేంద్రకు టికెట్ కేటాయించడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలదే తుది నిర్ణయం అని యెడ్యూరప్ప అన్నారు. తన కొడుకుకు శిఖారిపురా అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేయబోనని, కేవలం సూచనలు మాత్రమే చేస్తానని చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
శిఖారిపురా తాలూకాలోని అంజనాపురాలో శుక్రవారం యెడ్యూరప్ప మాట్లాడుతూ.. `వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నేను నా అసెంబ్లీ సీట్ను నా కొడుకు బీవై విజయేంద్రకు ఇచ్చేస్తున్నా. శిఖారిపురా ఓటర్లు భారీ మెజారిటీతో అతడ్ని గెలిపించాలి` అని అన్నారు. దక్షిణాది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన యెడ్యూరప్పను బీజేపీ నాయకత్వం పక్కకు పెట్టిందని వార్తలొచ్చాయి. కానీ, తనను పార్టీ పక్కన పెట్టేయలేదని యెడ్యూరప్ప చెప్పారు.
ఇదిలా ఉంటే యెడ్యూరప్ప ఎప్పటికీ రాజకీయాల నుంచి రిటైర్ కాబోరని, ఆయన మార్గదర్శకత్వంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై పేర్కొన్నారు. `ఆయన ఎప్పటికీ రిటైర్ కారు. యెడ్యూరప్ప ఎప్పటికీ రిటైర్ కారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బలం, శక్తియుక్తులు, మార్గదర్శకత్వం పార్టీ వెంటే ఉంటాయని శుక్రవారం అన్నారు. యెడ్యూరప్ప తండ్రి వంటి వారని, ఇది కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసునన్నారు.