Chandranath Rath : అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాలు వెల్లడైన అనంతరం పశ్చిమబెంగాల్ (West Bengal) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత (BJP leader) సువేందు అధికారి (Suvendu Adhikari) వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) దారుణహత్యకు గురయ్యారు. దాంతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సువేందు అధికారి ఆరోపించారు. హంతకులు రెండు రోజులపాటు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారని చెప్పారు.
ఈ ఘటనపై సువేందు అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ హత్య హృదయవిదారకమని, తాము ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి జరిగిన తీరును బట్టిచూస్తే.. దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఇది గత 15 ఏళ్ల అరాచక పాలన ఫలితమని మండిపడ్డారు. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభిస్తుందని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిద్ధ్నాథ్ గుప్తా తనకు హామీ ఇచ్చారని తెలిపారు.
కాగా బుధవారం రాత్రి బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్గ్రామ్లో చంద్రనాథ్ రథ్ హత్య జరిగింది. రథ్ ప్రయాణిస్తున్న కారును దుండగులు వెంబడించి మరీ కారు విండోలో నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతడి డ్రైవర్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.