న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన టాప్ 50 మంది వివరాలను కేంద్రం ప్రకటించింది. ఆ డిఫాల్టర్లు బ్యాంకులకు సుమారు రూ.92,570 కోట్లు ఎగవేసినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. మార్చి 31, 2022 నాటికి ఆ మొత్తాన్ని వాళ్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్.. లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. గీతాంజలి జెమ్స్ డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ బ్యాంకులకు సుమారు 7848 కోట్లు ఎగకొట్టినట్లు ఆయన తెలిపారు.
ఇక బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన టాప్ జాబితాలో ఉన్న వారిలో ఎరా ఇఫ్రా తర్వాత స్థానంలో ఉంది. ఆ సంస్థ సుమారు 5879 కోట్లు ఎగవేసింది. ఆ తర్వాత రీగో ఆగ్రో 4803 కోట్లు ఎగ్గొట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ విషయాన్ని మంత్రి తెలిపారు.
కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్(రూ.4,596 కోట్లు), ఏబీజీ షిప్యార్డ్(3708 కోట్లు), ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్(3311 కోట్లు), విన్సమ్ డైమండ్స్ అండ్ జ్వలరీ(2931 కోట్లు), రోటొమాక్ గ్లోబల్(2893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్స్(2311 కోట్లు), జూమ్ డెవలపర్స్(2147 కోట్లు) సంస్థలు కూడా భారీగా బ్యాంకులకు టోపీ పెట్టాయి.