న్యూఢిల్లీ, జనవరి 19: సంపన్నులకు సాధారణంగా పన్నులంటే ఇష్టముండదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మా మీద మరింత పన్ను వేయండి అంటూ వారు ప్రభుత్వాలను కోరుతున్నారు. 100 మందికి పైగా కుబేరులు ప్రభుత్వాలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. వారిలో ఈ హృదయ పరివర్తనకు కారణం ఏమిటంటారా? ప్రపంచంలోని మహాసంపన్నులపై సంపద పన్ను వేస్తే 2.52 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.190 లక్షల కోట్లు) వసూలవుతాయని, ఈ మొత్తంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వవచ్చని, 230 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయవచ్చని ఇటీవల విడుదలైన ఓ అధ్యయన నివేదిక తెలియజేసింది. బహుశా దీని నుంచి స్ఫూర్తి పొందిన 102 మంది ప్రపంచ కుబేరులు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బహిరంగ లేఖ రాశారు. డిస్నీ వారసురాలు అబిగేల్ డిస్నీ కూడా ఆ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ప్రస్తుత పన్ను వ్యవస్థ సంపన్నులను మరింత సంపన్నులను చేసేందుకు ఉద్దేశించి రూపొందించిందని పేర్కొన్నారు. సంపన్నులు న్యాయమైన వాటా ఇవ్వాలని ప్రపంచంలోని ప్రతి దేశం డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. సంతకాలు చేసిన కుబేరుల్లో అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇరాన్కు చెందిన వారు ఉన్నారు. కరోనా విజృంభించిన తొలి రెండు సంవత్సరాల్లో ప్రపంచంలోని 10 మంది కుబేరుల సంపద రెట్టింపు అయిందని, మరోవైపు అసమానతలు, పేదరికం అమాంతంగా పెరిగిపోయిందని ఆక్స్ఫామ్ ఇటీవల నివేదిక సమర్పించిన నేపథ్యంలో వీరు లేఖ రాయడం గమనార్హం.