న్యూఢిల్లీ: కర్నాటకలో ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి వెళ్తున్న ఘటనపై ఆ రాష్ట్రంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీకి అమ్మాయిలు హిజబ్ వేసుకుని కాలేజీకి వెళ్లడాన్ని నిరసిస్తూ మిగితా విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో హిజబ్ వివాదంపై కేసు విచారణకు ఉన్నది. అయితే ఈ మ్యాటర్ను తక్షణమే విచారణకు స్వీకరించాలని ఇవాళ సుప్రీంకోర్టులో కపిల్ సిబల్ కోరారు. ప్రస్తుతం ఆ కేసు కర్నాటక హైకోర్టులో ఉందని, అక్కడ విచారణ పూర్తి కావాలని, ఇప్పుడే ఆ అంశంలో మేం జోక్యం చేసుకోవడం సరికాదు అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. కర్నాటక హైకోర్టులో ఉన్న పిటిషన్ను ట్రాన్స్ఫర్ చేయాలని కపిల్ సిబల్ అభ్యర్థించారు. 9 మంది సభ్యుల ధర్మాసనం ముందు ఆ అంశాన్ని విచారించాలన్నారు.
హైకోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నదని, వాళ్లకు కనీసం ఒక్క రోజైనా సమయం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈ కేసులో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. కర్నాటక హైకోర్టులో చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవాస్తి, జస్టిస్ కృష్ణదాస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం హిజబ్ పిటిషన్ను విచారించనున్నది.