Punjab | ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపం ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏదో ఒక విధంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రాజకీయంగా విమర్శలకు దిగుతూనే వుంది. ఇక ప్రధాని మోదీ పూర్తి కాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ బీజేపీ దేశ వ్యాప్తంగా మహా మృత్యుంజయ హోమాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మహా మృత్యుంజయ హోమంపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆరోగ్యం బాగుండాలని తాము కూడా మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశారు. తన ఇంట్లోనే 11 మంది వేద పండితులతో మంగళవారం మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని ప్రకటించారు.
‘ప్రధాని మోదీకి ఎవరితోనైనా ప్రమాదం పొంచి వుంటే స్వయంగా నేను బగళాముఖి మంత్రాన్ని జపం చేస్తాను. దీంతో శత్రువులెవ్వరూ ఆయన దరి చేరరు. ఆయనకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇంకా ప్రాణాలకు ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి వుంటే మహా మృత్యుంజయ హోమం, జపం కూడా నేనే చేస్తాను. రేపు మా ఇంట్లో ఈ హోమం చేస్తా. జపం కూడా చేస్తా’ అని సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ ప్రకటించారు.