న్యూఢిల్లీ: తన ఆంటీకి గుడ్ బై చెప్పేందుకు ఒక చిన్నారి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతి కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక పాప నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి వద్దకు వెళ్లింది. విమానంలో ప్రయాణించనున్న తన ఆంటీకి గుడ్ బై చెబుతానంటూ చేతులతో సైగలు చేసింది. ఆ అధికారి ఓకే చెప్పడంతో ఆ చిన్నారి నడుస్తూ తన ఆంటీ వద్దకు వెళ్ళింది. మరోవైపు పాప రాకను గమనించిన ఆమె బంధువు ముందుకు వచ్చి ఆ చిన్నారిని హత్తుకుని చేతులతో ఎత్తుకున్నారు.
కెప్టెన్ హిందుస్తాన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘విమానాశ్రయంలో తన ఆంటీకి వీడ్కోలు చెప్పడానికి ఆమె ఆఫీసర్ని అడిగింది’ అని శీర్షిక పెట్టారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు భిన్నంగా స్పందించారు. ఇది చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని ఒకరు వ్యాఖ్యానించారు. ఆ చిన్నారి విధేయత తమను ముగ్ధులను చేసిందని కొందరు పేర్కొన్నారు.
అయితే ఇది ఏ ఎయిర్పోర్టులో తీసిన వీడియోనో తెలియకపోయినా చాలా మంది నెటిజన్లు మాత్రం ఖతార్లోని దోహాలో గల హమద్ అంతర్జాతీయ విమానాశ్రయమని తెలిపారు. ఆ ఎయిర్పోర్ట్కు అభినందనలు చెప్పారు.