న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనదైన శైలిలో విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి కూడా చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగమని ఎద్దేవా చేశారు. మొత్తం బడ్జెట్లో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే ఉందన్నారు. పేరా ఆరులో ‘పేద’ అనే పదం కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని ఈ మాత్రం గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలంటూ వెటకారంగా అన్నారు.
రాబోయే 25 ఏళ్ల ప్రణాళికను ఆర్థిక మంత్రి వివరిస్తున్నందుకు తాను ఆశ్చర్యపోయానని చిదంబరం అన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి శ్రద్ధ అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని విమర్శించారు. ‘అమృత గడియలు’ తెల్లవారుజాము వరకు ఓపికగా వేచి ఉండమని ప్రజలను కోరుతున్నారని, ఇది భారత ప్రజలను అపహాస్యం చేయడమేనని ఆరోపించారు.
దేశంలోని అత్యంత ధనికుల కోరికపైనే ఈ బడ్జెట్ను కేంద్రం తెచ్చినట్లుగా కనిపిస్తున్నదని చిదంబరం విమర్శించారు. క్రిప్టోకరెన్సీ నేటి నుంచి చట్టబద్ధమని ఆర్బీఐకి బదులుగా, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. వర్చువల్ డిజిటల్ ఆస్తులపై ( క్రిప్టోకరెన్సీ) 30 శాతం పన్ను వల్ల దేశంలోని 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ పెట్టుబడిదారీ బడ్జెట్ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.