న్యూఢిల్లీ: ఢిల్లీలో టూరిస్టుల సౌలభ్యం కోసం అక్కడి సర్కారు టూరిజం యాప్ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేజ్రివాల్ స్వయంగా యాప్ను లాంచ్ చేశారు. ఈ రోజు తాము ఒక టూరిజం యాప్ను ప్రారంభించామని, ఈ యాప్లో ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు సంబంధించిన సమాచారం ఉంటుందని కేజ్రివాల్ చెప్పారు. అదేవిధంగా వివిధ పర్యాటక ప్రాంతాల సందర్శనకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఈ యాప్లో అందుబాటులో ఉందన్నారు.
ఢిల్లీ వాసులేగాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ యాప్ను వినియోగించుకోవచ్చని కేజ్రివాల్ తెలిపారు. ప్రత్యేకించి విదేశీ పర్యాటకులకు ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఢిల్లీ పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాళ్లు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఢిల్లీలో టూరిజం అభివృద్ధికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందని కేజ్రివాల్ ఆశాభావం వ్యక్తంచేశారు.