న్యూఢిల్లీ, నవంబర్ 6: క్యాన్సర్.. భారత్ను కలవరపెడుతున్నది. దేశంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. డబ్ల్యూహెచ్వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఏటా రూ. 41,17,000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నదీ మహమ్మారి. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్య తరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ఇండియాలో కేసుల సంఖ్య మరీ దారుణంగా ఉన్నది. 2021 నాటికి భారత్లో 2.67 కోట్ల మంది దీని బాధితులే. ఈ సంఖ్య 2025 నాటికి 2.98 కోట్లకు చేరుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అంచనా వేసింది. ముఖ్యంగా ఏడు రకాల క్యాన్సర్లతో భారతీయులు ఎక్కువగా బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు (10.6 శాతం), రొమ్ము (10.5), నోటి (5.7), గర్భాశయ (4.3), కడుపు (5.2), అన్నవాహిక (5.8), కాలేయ (4.6శాతం) క్యాన్సర్లతో సతమతమవుతున్నారు.
నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
ముందుగా గుర్తిస్తేనే చికిత్స సులభం
అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినా చాలామందికి సకాలంలో క్యాన్సర్ చికిత్స అందడం లేదు. భారత్లో ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నా 2018లో 3,17,928 క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయి. దేశంలో క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతున్న న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ అభివృద్ధికి కారణమైన ప్రయోగం చేసిన నోబెల్ గ్రహీత మేడం క్యూరీ జయంతి రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని చేపట్టారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం, క్యాన్సర్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రభుత్వాల ముందున్న లక్ష్యం.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం..
8 నిమిషాలకో గర్భాశయ క్యాన్సర్ మరణం
భారతదేశంలో ఏటా పది లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇందులో మూడింట రెండొంతుల మందిలో వ్యాధి చివరి దశలో నిర్ధారణ అవుతున్నది. దీంతో రోగి జీవించే అవకాశాలు తగిపోతున్నాయి. అనేక కారణాల వల్ల క్యాన్సర్ను ఆలస్యంగా గుర్తించడంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నది. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు మృత్యువాతపడుతున్నారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తున్నది.