న్యూఢిల్లీ: ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ కార్యక్రమాన్ని ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో వివక్ష లేని వ్యవస్థను సృష్టించామన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం పునాదులపై దృఢంగా నిలబడే సమాజాన్ని నిర్మించినట్లు ప్రధాని తెలిపారు. భారత వైఖరి పురోగమిస్తోందని, ఆలోచనలోనూ, ఆవిష్కరణల్లోనూ దూసుకెళ్తోందన్నారు. చాలా ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశాన్ని స్వర్ణ భారత్ గా మార్చేందుకు కోట్లాది మంది వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశ ప్రగతి మీదే మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. నవ భారత్ నిర్మాణంలో భాగంగా యువత ముందుకు వెళ్తున్నట్లు మోదీ చెప్పారు. అమృతకాలమంటే నిద్రలో కలలు కనడం కాదు అని, వాస్తవంలో ఆ కలల్ని నిజం చేయడమన్నారు. రాబోయే 25 ఏళ్ల మనం కష్టానికి, త్యాగానికి ప్రతిఫలంగా నిలవాలన్నారు. వందల ఏండ్ల బానిసత్వం వల్ల కోల్పోయిన సమాజాన్ని రాబోయే 25 ఏండ్లలో మళ్లీ పునర్ స్థాపితం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.