రాంచి: సీమా-సచిన్ మాదిరిగా మరో జంట ప్రేమ కథ సరిహద్దులు దాటింది. జార్ఖండ్ వ్యక్తిని పెళ్లాడేందుకు పోలాండ్కు చెందిన మహిళ తన కుమార్తెతో కలిసి భారత్ వచ్చింది (Woman Flies To India). పెళ్లి కోసం స్థానిక కోర్టులో వారు దరఖాస్తు కూడా చేసుకున్నారు. పోలాండ్కు చెందిన బార్బరా పోలాక్, జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన షాదాబ్ మాలిక్ మధ్య సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని వారిద్దరూ నిర్ణయించారు.
కాగా, బార్బరా పోలాక్ తన ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి ఇటీవల భారత్ చేరుకుంది. షాదాబ్ మాలిక్ను కలిసిన తర్వాత వారిద్దరూ వారం పాటు ఒక హోటల్లో బస చేశారు. ఆ తర్వాత షాదాబ్ ఆమెను తన గ్రామమైన ఖుత్రాకు తీసుకెళ్లాడు. ప్రియుడి కుటుంబం ఇంట్లో ఉంటున్న బార్బరా, ఇంటి పనులతోపాటు పేడ ఎత్తడం వంటివి కూడా చేస్తున్నది. వారిద్దరూ పెళ్లి కోసం హజారీబాగ్ కోర్టులో దరఖాస్తు కూడా చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి గురించి మీడియాతో కూడా మాట్లాడారు.
మరోవైపు, విదేశీ మహిళ రాక గురించి హజారీబాగ్ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి పోలాండ్కు చెందిన బార్బరా పోలాక్ను కలిసి ఆమె గురించి ఆరా తీశారు. ఆమె టూరిస్ట్ వీసా కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలాండ్లో తనకు ఒక ప్రైవేట్ సంస్థ ఉన్నట్లు బార్బరా తెలిపింది. అలాగే మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ఆమె చెప్పింది. మొదటి భర్త ద్వారా ఎనిమిదేళ్ల కుమార్తె అన్యా పోలక్ ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత తన దేశానికి తిరిగి వెళ్తానని తెలిపింది. తన టూరిస్ట్ వీసాకు 2027 వరకు గడువు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే షాబాద్ అద్భుతమైన వ్యక్తి, చాలా స్వీట్ పర్సన్ అని బార్బరా ప్రశంసలతో ముంచెత్తింది.