రాంచీ: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగ (chain snatcher) బంగారు గొలుసు మింగాడు. అయితే అన్నవాహికలో అది ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. డోరండా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వంతెన సమీపంలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కునిపోయారు. ఆ దొంగలు బైక్పై పారిపోతుండగా పోలీసులు చూశారు. దీంతో ఐదుగురు పోలీసులు తమ వాహనాలతో ఆ దొంగలను ఛేజ్ చేశారు. కిలోమీటరు దూరం తర్వాత బైక్ను అడ్డగించి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు.
కాగా, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన బంగారు గొలుసును సల్మాన్ మింగేశాడు. ఒక పోలీస్ అధికారి ఇది చూశాడు. అయితే చైన్ను మింగిన సల్మాన్ ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. ఆ గొలుసు అన్నవాహికలో ఇరుక్కోవడంతో ఉదరం, కడుపులో నొప్పితో బాధపడ్డాడు. దీంతో పోలీసులు సల్మాన్ను రిమ్స్కు తరలించారు. ఎక్స్ రే తీయించగా గోల్డ్ చైన్ అతడి శరీరం లోపల చిక్కుకున్నట్లు గ్రహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల బృందం అతడ్ని పర్యవేక్షణలో ఉంచారు. గ్యాస్ట్రోస్కోపీ, ఎండోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా బంగారు గొలుసును సల్మాన్ శరీరం నుంచి బయటకు తీయాలని వైద్యులు యోచిస్తున్నారు.