Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తమ ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసింది. నిర్దేశిత సమయానికి 3.5 (మూడున్నర) గంట ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది.
‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో చెక్ఇన్, బోర్డింగ్ కోసం సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ సమయమే పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు నిర్దేశించిన సమయం కంటే కనీసం మూడున్నర గంట ముందే రావాలని కోరుతున్నాం. సెక్యూరిటీ తనిఖీలు సాఫీగా పూర్తి చేసుకునేందుకు ప్రయాణికులు తమ వెంట 7 కిలోలకు మించకుండా లగేజీని తీసుకురావాలి. ప్రయాణికులు 5, 6 గేట్ల ద్వారా టెర్మినల్ 3 కి చేరుకుంటే దగ్గరవుతుంది’ అని సూచించింది.
#6ETravelAdvisory #DelhiAirportUpdate #goIndiGo @MoCA_GoI @JM_Scindia pic.twitter.com/l9pDfm4Or6
— IndiGo (@IndiGo6E) December 12, 2022
కాగా, ఎయిర్పోర్టులో రద్దీ విషయమై ప్రయాణికులు తమ అవస్థలను ఆదివారం సోషల్ మీడియా ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకొచ్చారు. సాధారణ ప్రయాణికులే కాదు.. పలువురు ప్రముఖులు సైతం ఢిల్లీ విమానాశ్రయంలోని పరిస్థితులను వివరిస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఈ మేరకు కిక్కిరిసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంజ్ ఫొటోలను సైతం పంచుకున్నారు. ముఖ్యంగా మూడో టెర్మినల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర మంత్రి సోమవారం ఉదయం విమానాశ్రయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి.. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.