అగర్తలా: నిన్న త్రిపుర పోలీసులు అరెస్టు చేసిన తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సయోని ఘోష్కు బెయిల్ లభించింది. త్రిపుర పోలీసులు ఆదివారం సాయంత్రం సయోనీ ఘోష్ను అరెస్ట్ చేశారు. ఆమెను హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ చేసినట్లు పశ్చిమ త్రిపుర అదనపు ఎస్పీ (అర్బన్) బీజే రెడ్డి తెలిపారు. ఆమె తన కారుతో బీజేపీ కార్యకర్తలను తొక్కి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇవాళ ఆమెను పశ్చిమ త్రిపురలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, త్రిపుర పోలీసులు తనపై హత్యాయత్నం కేసు మోపడాన్ని సయోని ఘోష్ ఖండించారు. బీజేపీ సమావేశం జరిగే చోట కారులో వెళ్తున్న వీడియోను ఆమె ట్వీట్ చేశారు. పోలీస్ స్టేషన్కు వెళ్లే వరకు తనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తనకే తెలియలేదని ఘోష్ చెప్పారు. కాగా, సయోనీతోపాటు పోలీస్ స్టేషన్కు వెళ్లిన టీఎంసీ కార్యకర్తలపై హెల్మెట్లు ధరించి వచ్చిన బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ వీడియోను టీఎంసీ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.