కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందాడు. అలాగే పంచాయతీ చీఫ్ సోదరుడు లాల్తు షేక్ సైతం గాయపడ్డాడు. అతన్ని కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేయడంతో న్యూటన్ షేక్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ఖండించారు. మార్గ్రామ్లో కాంగ్రెస్కు సంస్థాగతంగా బలం లేదని తెలిసి ఎవరైనా ఆ పార్టీకి ప్రచారం కల్పించాలనుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చౌదరి అన్నారు. దాడి మావోయిస్టుల పని కావొచ్చని బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పేర్కొన్నారు. ఇదో పెద్ద కుట్ర అని, బాంబుల తయారీ మూలాలపై విచారించాలన్నారు.