కోల్కతా : కాషాయ పార్టీ గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని టీఎంసీ ఎంపీలు గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కలిసి మెమొరాండం సమర్పించారు. త్రిపురలోని సుర్మా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ప్రోద్బలంతో గూండాలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని త్రిపురలో హింసాత్మక ఘటనలపై సీఈసీకి టీఎంసీ ఎంపీల బృందం వివరించింది.
సుర్మా అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీలో చేరిన 70 కుటుంబాలపై బీజేపీ మూకలు దాడి చేశాయని సీఈసీకి ఫిర్యాదు చేశామని సమావేశానంతరం టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. తమ విజ్ఞాపనపై సీఈసీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీజేపీ గూండాల దాడిలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని సీఈసీ దృష్టికి తీసుకువచ్చామని రాయ్ చెప్పారు.
ఎన్నికల పరిశీలకులను సందర్శించి నివేదిక ఇవ్వాలని సీఈసీ కోరారని తెలిపారు. కాగా త్రిపురలో అగర్తలా, బర్దోవలి, సుర్మా, జుబరాజ్నగర్ అసెంబ్లీ స్దానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని టీఎంసీ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక సీఈసీని కలిసిన టీఎంసీ ఎంపీల బృందంలో సౌగత రాయ్తో పాటు కలోలి ఘోష్, జవహర్ సిర్కార్, ప్రతిమా మొండల్, లుజింహో ఫలెరియో, నుస్రత్ జహన్ రుహి ఉన్నారు.