Saayoni Ghosh : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, 20 మంది ఎంపీల తిరుగుబాటుతో సతమతమవుతున్న మమతకు ఆమెకు అత్యంత విధేయురాలైన మరో ఎంపీ షాకిచ్చారు. మమతకు ప్రధాన మద్దతుదారుగా గుర్తింపు పొందిన యువ ఎంపీ సాయోని ఘోష్ (Saayoni Ghosh) అనూహ్యంగా తిరుగుబాటు వర్గంలో చేరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇది మమత నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పలువురు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. లోక్సభలోని మొత్తం 28 మంది టీఎంసీ సభ్యులలో ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలు వ్యతిరేకత తెలుపడం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే జాదవ్పూర్ ఎంపీ సాయోని ఘోష్ ఇప్పటివరకు మమతా బెనర్జీకి వెన్నంటి నిలిచారు. భవిష్యత్తులో మమత ప్రధాని కావాలంటూ బలంగా ఆకాంక్ష వెలిబుచ్చారు. కానీ ఇప్పుడామె అనూహ్యంగా తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు. రెబెల్ గ్రూప్కు మద్దతుగా సంతకం చేసి ఢిల్లీలో మకాం వేశారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేతగా అభిషేక్ బెనర్జీని తొలగించి, ఆ స్థానంలో కకోలీని నియమించాలని కోరుతూ తిరుగుబాటు ఎంపీలు ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖను అందజేశారు.
ఇదిలావుంటే తాము బీజేపీలో చేరబోమని రెబెల్ ఎంపీలు స్పష్టంచేశారు. అయితే జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనప్పుడు ఎన్డీయేకు మద్దతు ఇస్తామని రెబల్ ఎంపీలు స్పష్టంచేశారు. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి విపక్ష నాయకులతో సమావేశమవుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే తిరుగుబాటు వర్గం పేర్కొంటున్న సంఖ్యాబలంపై మమతా వర్గం తీవ్ర సందేహాలు వ్యక్తంచేస్తోంది.